దేశంలో ఎక్కడ ఏం జరిగినా.. తెలంగాణనే
దేశంలో ఎక్కడ ఏం జరిగినా, దానికి సంబంధించిన మూలాలు తెలంగాణలో బయటపడుతున్నాయని బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్, మజ్లీస్ స్నేహం వల్లే అనేక అసాంఘిక శక్తులకు రాష్ట్రం అడ్డగా మారిపోయిందన్నారు. తెలంగాణకు అసలు హోంమంత్రి ఉన్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నా పోలీసులు ఎందుకు నియంత్రించలేకపోతున్నారని ప్రశ్నించారు. మే 14న రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రాబోతుంది. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ చరిత్రను సృష్టించబోతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రజలను వంచించారు. బహిరంగ సభా వేదికగా కేసీఆర్ను రైతు, యువజన దళిత ద్రోహిగా నిలబెట్టబోతున్నామన్నారు. టీఆర్ఎస్ సర్కార్పై సకల జనులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ధనిక రాష్ట్రంలో ప్రజల ఆస్తులను ప్రభుత్వం అమ్ముకుంటూ పోతోంది. ప్రజా ద్రోహి కేసీఆర్ గద్దె దిగాలి. కేసీఆర్ ఎన్నికలు ఎప్పుడు వెళ్లినా బీజేపీ సిద్దం అని ప్రకటించారు.













