కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే…. దళితుడిని
దళితులకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత బంధు పథకం బీఆర్ఎస్ నేతలకు దోపిడీగా మారిందన్నారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులకు అండగా ఉన్నట్టు కాదని, 16 శాతం ఉన్న మాదిగలకు ఇప్పటికీ మంత్రి వర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదని ప్రశ్నించారు. దళిత నాయకుడు ఖర్గేను తమ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, కాంగ్రెస్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీ నుంచి మహేశ్వర్ రెడ్డి వెళ్లినా ఎలాంటి నష్టం లేదన్నారు. తాను కూడా పార్టీ వీడుతున్నట్లు ఎన్నోసార్లు ప్రచారం చేశారని, అయినా తాను పార్టీ మారలేదన్నారు. గిట్టనివాళ్లు దుష్ప్రచారం చేస్తుంటారని వ్యాఖ్యానించారు. 33 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా పీసీసీ అధ్యక్ష పదవి రానంత మాత్రాన పార్టీ మారతానా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నా పాదయాత్ర ఉండదు. భట్టి విక్రమార్క పాదయాత్రనే నా పాదయాత్ర. ఇవాళ ఖర్గేను అడుగుతాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని కోరతాం అని తెలిపారు.













