టెమ్రీస్ స్కూల్ను సందర్శించిన అమెరికా ప్రతినిధుల బృందం
తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ గురుకులాల పనితీరుకు అమెరికాకు చెందిన అసోసియేషన్ మాంటిస్సోరీ (ఏఎంఐ) ప్రతినిధులు ముగ్ధులయ్యారు. రాష్ట్రంలో మైనారిటీల కోసం 204 మైనారిటీ రెసిడెన్షియల్స్ స్కూళ్ళు, రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసి కార్పొరేట్ తరహా సౌకర్యాలు కల్పిస్తూ, ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థిపై ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకు ఖర్చు చేస్తున్నది. ఈ ఏర్పాట్లును స్వయంగా చూసి అమెరికా బృందం హర్షం వ్యక్తం చేసింది.
తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ(టెమ్రీస్) ఆహ్వానం మేరకు ఏఎంఐ డైరెక్టర్ గ్రెగ్ మెక్డోనాల్డ్ నేతృత్వంలో అమెరికా ప్రతినిధులు హైదరాబాద్లోని ముషీరాబాద్ టెమ్రీస్ స్కూల్ను సందర్శించి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతోనూ ముచ్చటించి సౌకర్యాలు, భోజన వసతి వివరాలు తెలుసుకున్నారు. నాంపల్లిలోని అనీసుర్గుర్బా అనాథాశ్రమానికి చెందిన పిల్లలను టెమ్రీస్ ఈ స్కూలులో చేర్చించింది. మైనారిటీల రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు మాంటిస్సోరీ విద్యావిధానం అమలు చేయాలని టెమ్రీస్ నిర్ణయించింది. మాంటిస్సోరీ బృందంతో టీచర్లకు శిక్షణ ఇప్పించేందుకు కార్యచరణ రూపొందించింది. ఏఎంఐ డైరెక్టర్ మెక్డోనాల్డ్తో 10 మంది టెమ్రీస్ ఉపాధ్యాయులకు ఓరియెంటేషన్ శిక్షణ ఇవ్వనున్నారు. మార్చిలో కూడా రాష్ట్ర పర్యటనకు వచ్చి ఆయన పూర్తిస్థాయి శిక్షణ ఇస్తారు. ఏఎంఐ బృందం వెంట టెమ్రీస్ కార్యదర్శి బీషఫీఉల్లా, డిప్యూటీ సెక్రటరీ లతీఫ్ తదితరులు ఉన్నారు.













