దేశ చరిత్రలో ఇలాంటి విధానం ఎప్పుడూ చూడలేదు : మంత్రి తలసాని
ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని, దేశ చరిత్రలో ఇలాంటి విధానాలను ఎప్పుడూ చూడలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఐటీ దాడులపై మంత్రి తలసాని స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని, వాటిని ఎదుర్కొంటామన్నారు. ఈ దాడులను ముందే ఊహించామని, సీఎం కేసీఆర్ ముందే చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు వ్యవస్థలు మీచేతుల్లో ఉండొచ్చు, రేపు మా చేతుల్లో ఉండవచ్చు అని అన్నారు. లక్ష్యంగా చేసుకున్న దాడులకు టీఆర్ఎస్ నాయకత్వం భయపడదని స్పష్టం చేశారు. జరుగుతున్న పరిణామాలను ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తామని అన్నారు. ప్రజలను చైతన్యం చేసి ఏంటనేది వ్యవస్థలకు చూపిస్తామన్నారు. అంత భయపడితే హైదరాబాద్లో ఎందుకుంటామని అన్నారు. ఏం జరుగుతుందో భవిష్యత్లో చూస్తారన్నారు. ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తామని, 15 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో హాజరవుతారని తెలిపారు.













