అవినీతి మరకే ఉంటే మీ ప్రభుత్వంలో… డీజీపీగా ఎందుకు కూర్చోబెట్టారు?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన విమర్శలపై మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడారు. ఆమె మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ యువతకు న్యాయం చేయలేదు. వారి భవిష్యత్ను ప్రశ్నార్థకం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. మా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన వాళ్లు ఇప్పుడు మాపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి నియామకం జరిగి రెండు వారాలే అయింది. 36 ఏళ్లుగా ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన ఏమైనా లిక్కర్ స్కాం చేశారా? పేపర్లు లీక్ చేశారా? అవినీతి మరకే ఉంటే మీ ప్రభుత్వంలో డీజీపీగా ఎందుకు కూర్చోబెట్టారు? సింగరేణి నిధులను సిరిసిల్ల, గజ్వేల్కు తరలించుకుపోయిందెవరు? నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను మేం తీసుకుంటాం. మాట నిలబెట్టుకుంటామనే మాపై అక్కసుతో విమర్శలు చేస్తున్నారు అని అన్నారు.













