ప్రభుత్వం సహకరిస్తే మేమూ సిద్ధం.. సీఎం రేవంత్ తో మైక్రాన్ సీఈవో
ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన సంజయ్ మెహ్రోత్రా సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మైక్రాన్ కంపెనీ ఆసక్తి చూపితే రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. పరిశ్రమల స్థాపన, నైపుణ్యాల అభివృద్ది, ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అమెరికా చెందిన ఈ సంస్థ సెమీ కండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీ. మెమరీ చిప్ తయారు చేసే అతి పెద్ద సంస్థల్లో ఒకటి.













