అంబానీ, అదానీ వ్యాపారాలకు మోదీ అండ : కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్

బిజినెస్మెన్ సహకారంతోనే మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రముఖ వ్యాపారవేత్త అదానీకి పనికొచ్చే విధంగా మార్చేశారని ఆయన విమర్శించారు. జీవీకే గ్రూప్స్, అంబుజా సిమెంట్స్, ఎన్డీటీవీ వీటన్నింటిపై ఈడీ దాడి చేసిందని… ఆ తర్వాత ఈ కంపెనీలన్నీ అదానీ హస్తగతం అయ్యాయని గుర్తుచేశారు. అల్ట్రాటెక్ సిమెంట్ పై అదానీ కామెంట్ చేశారని… ఆ తర్వాత ఆ సంస్థపై సీబీఐ దాడులు చేసిందని దుయ్యబట్టారు.
అదానీ కంపెనీల్లో ఎస్బీఐ, ఎల్ఐసీ కంపెనీలు షేర్లు కొనుగోలు చేస్తున్నాయన్న ఆయన.. ఎవరి ఒత్తిడితో ఇదంతా జరుగుతోందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశీ పర్యటనలకు వెళ్తున్న ప్రధాని మోదీ.. తన వెంట అదానీని కూడా తీసుకెళ్తున్నారని, అక్కడి కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తున్నారని మధుయాష్కీ అన్నారు. అంబానీ, అదానీల వ్యాపారాలకు మోదీ పూర్తిగా అండగా ఉంటున్నారని, తన మాట వినని కార్పొరేట్ సంస్థలను ఈడీ, ఐటీ రెయిడ్స్తో బెదిరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కృష్ణపట్నం పోర్ట్, జీవీకే గ్రూప్స్లను కూడా ఇప్పటికే బెదిరించారన్నారు. ఈ క్రమంలోనే మోదీకి వ్యతిరేకంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని మధు యాష్కీ హెచ్చరించారు. దేశ సంపదను బయట దేశాలకు అదానీ తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, అదానీ, సెబీ ఛైర్మన్ ముగ్గురూ దేశ సంపదను దోచేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.