బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే … అలాంటి అధికారులకు

రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు పోరుబాట కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. జైలుకు వెళ్లేందుకూ సిద్ధమని చెప్పారు. అక్రమంగా కేసులు పెట్టి వేధించే అధికారుల పేర్లు రాసిపెట్టాలని పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. మహిళలకు తులం బంగారం, రైతులకు రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు. రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్ నేతలను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారని ప్రజలు పోలీస్స్టేషన్ల ముందు క్యూ కడితే మీ పరిస్థితేంటి? అధికారులు న్యాయం, ధర్మం ప్రకారం ముందుకెళ్లాలి. పైనుంచి వచ్చే ఒత్తిడులతో ఇష్టారీతిన వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అలాంటి అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తాం అని అన్నారు.