ఐటీ హబ్ -2 నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
ఖమ్మంలో ఐటీ హబ్-2 నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ దక్షత కలిగిన సీఎం, స్థిరమైన ప్రభుత్వం వల్ల రెట్టింపు వేగంలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్లు ఉంటే, 2021కి రూ.లక్షా 40 వేల కోట్లకు ఎగబాకింది. సమర్థవంతమైన అధికారులు ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. దేశంలోని ఇతర నగరాలను వదిలేసి హైదరాబాద్ వస్తున్నారంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలు, వాతావరణ పరిస్థితులే కారణమని తెలిపారు. హైదరాబాద్కు మాత్రమే ఐటీ పరిమితం చేయొద్దనే ఉద్దేశంతో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తున్నామని తెలిపారు.
పువ్వాడ అజయ్ పట్టువదలని విక్రమార్కుడిలా పని చేస్తున్నారు అని ప్రశంసించారు. ఖమ్మం ప్రజలకు ఏం కావాలో అది చేసిపెట్టే నాయకుడు అజయ్ అని కొనియాడారు. ఒక పని పూర్తయ్యే వరకు ఒకే రకమైన ఏకాగ్రతతో పని చేసేవారే నిజమైన నాయకత్వం అని సీఎం అంటుంటారు. అలా అజయ్ ముందుకు పోతున్నారు. స్థానికంగా నాయకత్వం బలంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎక్కడి యువతకు అక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. టీ ఫైబర్ పూర్తయిన తర్వాత ప్రతి ఇంటికి బ్రాడ్ బాండ్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ద్వితీయ శ్రేణి నగరాల్లో డిజిటల్ ఇన్ఫ్రాస్టక్చర్ పెంచుకుంటున్నాం. సాంకేతిక పరిజ్ఞానం సాంమాన్యుడికి ఉపయోగపడాలి అనే ఆలోచనతో ముందుకు పోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్ రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.













