ఫ్రెంచ్ సంస్థలకు పెద్దపీట వేస్తాం : మంత్రి కేటీఆర్
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో భారత్-ఫ్రాన్స్ పరిశ్రమలు, వాణిజ్యమండళ్ల సమాఖ్య ఆధ్వర్యంలో పెట్టుబడుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఫ్రెంచ్ సంస్థలకు పెద్దపీట వేస్తామని అన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలకు సమానంగా లేదా వాటికి మించి భారీగా ప్రోత్సహకాలు అందిస్తామని తెలిపారు. టీఎస్ఐపాస్ పారిశ్రామిక విధానం రాష్ట్రంలో అమలవుతోందని, దీని ద్వారా రూ.వేలకోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు తెలంగాణకు దక్కాయన్నారు.
దేశంలో పెట్టుబడులు సమీకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. రాష్ట్రంలో 89 దేశాలకు చెందిన పారిశ్రామిక సంస్థలు నడుస్తున్నాయని తెలిపారు.
ఫ్రాన్స్కి చెందిన సినోఫి, కియోలిస్, సెయింట్ గోబెన్, సాఫ్రిన్, క్యాప్ జెమిని వంటి కంపెనీలు ఇప్పటికే రాణిస్తున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు అసవరమైన వనరులన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. జీవశాస్త్రాలు, ఐటీ, బయోటెక్, మైమానిక, రక్షణ తదితర రంగాలకు రాష్ట్రం ఆకర్షణీయంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఏ దేశం వారికైనా నివసించేందుకు అత్యంత అనుకూలమైన నగరం హైదరాబాద్ ఇది ఫ్రెంచ్ సంస్థలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది. ఆయా కంపెనీల భవిష్యత్తు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అన్ని విధాల అనువుగా ఉందని ఫ్రెంచ్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ అన్నారు. తయారీ రంగంలో పాటు అంకురాలు, ఆవిష్కరణలకు తెలంగాణ ప్రోత్సాహాన్ని అందించడం, మానవ వనరులను సృష్టించడం అభినందనీయమన్నారు. తెలంగాణలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా సహకరిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక భాగస్వామ్యం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం, ఫ్రెంచ్ వ్యాపార వర్గాలతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ సదస్సులో తెలంగాణ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ఐఎఫ్సీసీఐ అధ్యక్షుడు సుమీత్ ఆనంద్ పాల్గొన్నారు.













