సీఎం పదవికి కేటీఆర్ అర్హుడు : గుత్తా
ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ అన్ని విధాలుగా అర్హుడని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ డైనమిక్ లీడర్ అని, ఆయనకు సీఎం పదవిపై టీఆర్ఎస్ పార్టీలో ఏం చర్చ జరుగుతుందనే విషయం తనకు తెలియదని చెప్పారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఏకగ్రీవం అయితే బాగుంటుందనేది తన అభిప్రాయమని చెప్పారు. అయినా పార్టీ గుర్తునుబట్టి గెలుపు ఓటమలు ఉంటాయి. గతంలో జానారెడ్డి కూడా ఓడిపోయారని గుర్తు చేశారు. టికెట్ ఎవరికి ఇస్తారనే విషయంపై ఇంకా సృష్టత లేదన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని చెప్పారు. ఒకట్రెండు సీట్లు పెరిగినంత మాత్రాన ఉబ్బిపోవద్దని సూచించారు. బీజేపీ వాపు నుంచి బలుపు అనుకుంటే పొరపాటని విమర్శించారు.
ప్రస్తుతం రాజకీయాల్లో మాట్లాడుతున్న భాష చాలా గోరంగా ఉంటుందని, అది భవిష్యత్ తరాలకు మంచిది కాదన్నారు. తామున్న పదవికి మచ్చ తెచ్చేలా రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఉండకూడదని సూచించారు. కొందరు ఎంపీలు వాడుతున్న భాష వల్లే ప్రజల రాజకీయ నాయకులను అదోలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వాడిన భాష వేరని, ఇప్పుడు వాడుతున్న భాష వేరని చెప్పారు. కేసీఆర్ నేరుగా ఎవరినీ విమర్శించలేదన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు తాను మొదటి నుంచి వ్యతిరేకమేనని చెప్పారు. సాగర్లో స్థానికత పెద్ద సమస్య కాదని చెప్పారు. ఫిబ్రవరిలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.













