పారిశ్రామిక సదస్సు మాకు గర్వకారణం
ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థాపకుల మూడు రోజుల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా అంగీకరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత్, అమెరికా సంయుక్తాధ్వర్యంలో నవంబర్ 28 నుంచి జరిగే ఈ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. చారిత్రక నగరమైన హైదరాబాద్ మరో చారిత్రక సదస్సునకు వేదిక కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రపంచ ప్రముఖ పారిశ్రామిక వ్యవస్థాపకులంతా తరలిరావడం ఇక్కడి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సదస్సు సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేసిన ప్రధానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సులో అమెరికా బృందానికి ఇవాంకా నాయకత్వం వహిస్తుండగా, ప్రధాని నరేంద్రమోదీ విశిష్టఅతిథిగా హాజరవుతున్నారు.













