లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటూ రాదు : కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భువనగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని తెలిపారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందిస్తున్నామన్నారు. గ్రూప్-1, డీఎస్పీ నోటిఫికేషన్లు ఇచ్చామని, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. యాదగిరిగుట్ట దేవస్థానం నిర్మాణంపై విచారణ చేయిస్తామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణం విషయంలో మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా దాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రతిష్ఠ దిగజారింది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాలేదు. ఆ పార్టీ ఖాళీ అయింది. లోక్సభ ఎన్నికల్లో వారికి ఒక్క సీటూ రాదు. రాష్ట్రంలో 13-14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. బీఆర్ఎస్ నేతలే మమ్మల్ని అభినందిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మరింత శ్రమించాలి. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసింది. తెలంగాణ నుంచి ఆయన పోటీ చేస్తే ప్రజలు కచ్చితంగా గెలిపిస్తారు అని అన్నారు.