8 సీట్లతో దేశంలో ఎలా చక్రం తిప్పుతారు ? : కిషన్ రెడ్డి
పార్లమెంట్లో టీఆర్ఎస్కు ఇప్పుడున్న 8 సీట్లతో దేశంలో ఎలా చక్రం తిప్పుతారు? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మజ్లిస్ బలోపేతం కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని ఆరోపించారు. నెగటివ్ ఆటిట్యూడ్తో వచ్చే ఏ పార్టీకి మనుగడ లేదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోందని, ఆ పార్టీకి మిగిలిన ఏకైన మిత్ర పక్షం మజ్లిస్ మాత్రమేనన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారో టీఆర్ఎస్ నేతలకే తెలియదని ఎద్దేవా చేవారు. కల్వకుంట్ల కుటుంబం అంధకారంలోకి పోతోంది. టీఆర్ఎస్ వైఫల్యాల మీద చర్చ జరగొద్దనేది కేసీఆర్ ఆలోచన. కవిత కేంద్ర మంత్రి, కేటీఆర్ తెలంగాణ సీఎం, తాను ప్రధాని అయినట్లు ఫాంహౌస్లో ఆయన కలలు కంటున్నారు. కల్వకుంట్ల కుటుంబసభ్యులకు నిద్రలోనూ ఈడీ, సీబీఐ, ఐటీ కనిపిస్తున్నాయి అని అన్నారు.













