జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆయన సృష్టం చేశారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ, జీహెచ్ఎంసీ పరిధిలో క్రియాశీలకంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తలు వచ్చాయి. వారి వినతి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులను, నగర పరిధిలోని కమిటీలకు సృష్టం చేశాను. నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై చర్చించుకున్నారు.
జీహెచ్ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయి. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. వారి అబీష్టానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను జనసేన పార్టీ నిలుపుతుంది అని పవన్ సృష్టం చేశారు.













