పాదయాత్ర ఎవరి కోసం : జగ్గారెడ్డి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్ర ఎందుకు నిర్వహిస్తున్నాడో, ఎవరి కోసం నిర్వహిస్తున్నాడో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ పీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డికి నిర్వహించిన సన్మాన సభలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలను పెంచింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, అప్పుడు వేధిస్తున్న పోలీసుల గురించి ఆలోచిద్దాం అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో పనికి రాని వారంత తొడలు కొడుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు వారి తొడలు వంచే సమయం రాబోతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు తొడలు వంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోనే జహీరాబాద్ కాంగ్రెస్కు కంచుకోటగా ఉంటూ వస్తోందన్నారు. కాంగ్రెస్తో లబ్ధి పొందిన వారే బయటకు వెళ్లి కాంగ్రెస్ను ఓడించారన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించుకుని కాంగ్రెస్ సత్తా చాటాలన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.













