తెలంగాణలో పెట్టుబడుల జాతర
తెలంగాణ వస్తే కరెంటు ఉండదు. పరిశ్రమలు తరలిపోతాయి. పెట్టుబడులు వచ్చే అవకాశమే లేదు అంటూ చాలాకాలం సాగిన ప్రచారానికి బ్రేక్ పడింది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనే పెట్టుబడులకు తెలంగాణ స్వర్గాధామమైంది. అసోచామ్ సర్వేతో రాష్ట్ర ప్రభుత్వం మరింత విశ్వాసం కనిపిస్తోంది. దీంతో తెలంగాణ ఇస్తే ఆర్థిక అరాచకం తప్పదన్న గత ప్రచారానికి తెరపడింది. యువ రాష్ట్రమైన తెలంగాణ మూడేళ్లలో పెట్టుబడుల వృద్ధిరేటు 68.6 శాతం నమోదు చేసిన ఆర్థిక నిపుణులను ఆశ్చర్యపర్చింది.
2011-12 వరకు తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, విద్యుత్, సేవలు, ఇరిగేషన్ కలిపి రూ.3,311,242 మిలియన్ల పెట్టుబడులు మాత్రమే వస్తే, ఐదేళ్లలో రూ.5,925,607 మిలియన్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఇందులో ఇరిగేషన్ పెట్టుబడులు రికార్డుస్థాయిలో వచ్చాయి. ఇరిగేషన్ రంగంలో పెట్టుబడులు 2012 వరకు రూ.812,098 మిలియన్లు ఉంటే, గత ఐదేళ్లలో రూ.1,648,030 మిలియన్లు వచ్చాయి. మొత్తం పెట్టుబడుల్లో ఇరిగేషన్ వాట 24.5 శాతం నుంచి 27.8 శాతానికి పెరిగింది. విద్యుత్ రంగంలో పెట్టుబడులు రూ.364,502 మిలియన్లు నుంచి రూ.1,094,422 మిలియన్లకు, సేవారంగంలో రూ.764,522 మిలియన్ల నుంచి రూ.1,475,948 మిలియన్లకు పెరిగాయి.
మైనింగ్లో రూ.41,682 మిలియన్ల నుంచి రూ.91,720 మిలియన్లకు పెరిగాయి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఆహార, ఆగ్రో ఉత్పత్తులు, జౌళి, రసాయనాలు, వినిమయ వస్తువులు, లోహ ఉత్పత్తుల్లో పెట్టుబడులు రూ.41,682 నుంచి రూ.91,720 మిలియన్లకు పెరిగాయి. విద్యుత్ రంగంలో పెట్టుబడులు 12 నుంచి 18.5 శాతానికి, సేవా రంగంలో 23.1 శాతం నుంచి 24.9 శాతానికి పెరిగాయి. తెలంగాణ అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, అద్భుతమైన పారిశ్రామిక విధానాల వల్ల ఆర్ధికాభివృద్ధి రేటు గణనీయంగా పెరిగిందని అసోచామ్ పేర్కొనడం గమనార్హం. దక్షిణాది ర్ఱాష్టాల్లో పెట్టుబడుల వృద్ధిరేటు 79 శాతం ఉంటే, ఆంధ్రప్రదేశ్లో 50.8 శాతం, కేరళలో 18.9 శాతం, తమిళనాడులో 11.2 శాతం, కర్నాటకలో నెగిటివ్ వృద్ధిరేటు 0.2 శాతం నమోదైంది.
తెలంగాణలో పరిశ్రమలకు పెట్టుబడులు వెల్లువెత్తేందుకు ఇక్కడి వాతావరణం, మౌలిక సదుపాయాలు కారణమని ఫ్యాప్సీ వర్గాలు అంటున్నాయి. జిఎస్డిపి వృద్ధిరేటు 2013-14లో 5.6 శాతం ఉంటే, 2014-15లో 8.7 శాతం, 2015-16లో 9.5శాతం, 2016-17లో 10.1 శాతం పెరిగింది. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని చెప్పేందుకు ఇదో మంచి ఉదాహరణ అని పారిశ్రామిక వర్గాలు తెలిపాయి.













