ఘనంగా ఇక్ఫాయ్ 11వ స్నాతకోత్సవం …ముఖ్య అతిథిగా డీపీ సింగ్
జాతీయ విద్యా విధానంతో యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని విశ్వవిద్యాలయ నిధుల సంఘం చైర్మన్ డీపీ సింగ్ స్పష్టం చేశారు. ఇక్ఫాయ్ 11వ స్నాతకోత్సవం వర్చ్యువల్ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న 2,287 మంది విద్యార్థులకు పట్టాలను అందించారు. వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ నుంచి బంగారు పతకాలు అందుకున్నారు. ఈ సందర్భంగా డీపీ సింగ్ మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చాక డిగ్రీ కోర్సుల్లో అప్రెంటిస్షిప్తో కూడిన కోర్సులు ప్రవేశపెట్టాలని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. యూజీసీ గుర్తింపు పొందిన 17 ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయన్నారు. కొత్తగా వస్తున్న పరిజ్ఞానంపై విద్యార్థులు ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు.
2025లోగా భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలంటే రానున్న ఐదేళ్ల పాటు 9 శాతానికి పైగా వృద్ధిరేటు నమోదు చేయాల్సి ఉంటుందని ఇక్ఫాయ్ కులపతి ఆర్బీఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అన్నారు. విద్యార్థులు దృఢసంకల్పంతో సాగితేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని తెలిపారు. ఇక్ఫాయ్ ఉపకులపతి జెమహేందర్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల వర్సిటీ గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు.













