ఆధార్ వివరాలు అడగొద్దు : హైకోర్టు
ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఆధార్ వివరాలు తొలగించాలని ప్రభుత్వానికి హైకోర్టు సృష్టం చేసింది. సాఫ్ట్వేర్లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపేయాలని, కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని ఆదేశించింది. ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం గతంలో న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని, తెలివిగా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తే అంగీకరించబోమని మరోసారి సృష్టం చేసింది.
రిజిస్ట్రేషన్లు యధావిధిగా కొనసాగించాలని, కానీ రిజిస్ట్రేషన్ అథారిటీ మాత్రం ఆధార్ కార్డ్ వివరాలు అడగొద్దని.. వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్ మినహాయించి ఇతర గుర్తింపు కార్డులను అంగీకరించాలని, సాఫ్ట్వేర్, మ్యానువల్లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల సవరణకు ప్రభుత్వం వారం రోజుల సమయం కోరగా.. హైకోర్టు తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.













