మరో ఐటీ టవర్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో రెండో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. రూ.36 కోట్ల వ్యయంతో 55 వేల చదరపు అడుగుల్లో టవర్ను నిర్మించనున్నారు. ప్రత్యక్షంగా 570 మంది ఒకేసారి పని చేసుకునేలా సువిశాలమైన భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఖమ్మంలోని ఇల్లందు సర్కిల్ వద్ద ప్రస్తుతం ఐటీ హబ్-1 ఇప్పటికే ప్రారంభించగా.. సేవలు నిర్విరామంగా సాగుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కృషితో తాజాగా మరో టవర్ మంజూరైంది. టవర్ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేయడంతో జిల్లా యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. టవర్ నిర్మాణమై అందుబాటులోకి వస్తే జిల్లా నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ఆయా టవర్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.













