తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రారంభించిన e-office system
గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆశయాల కనుగుణంగా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనము పెంపొందించడానికి e-office system ప్రవేశపెట్టబడింది. 6 శాఖలలో e-office system ప్రారంభం సందర్భంగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అతి కొద్ది కాలంలోనే అధికారులు కష్టపడి e-office system అందుబాటులోనికి తీసుకొని వచ్చినందుకు అధికారులను అభినందించారు. ఈ రోజు నుండి ఈ క్రొత్త విధానం ద్వారా 1600 మంది పైగా ఉద్యోగులు పనిచేస్తారని అన్నారు. సాధారణ పరిపాలనా శాఖ, అబ్కారీ, మద్య నిషేధ శాఖ, వాణిజ్య పన్నులు, ప్రధాన కమీషనర్, భూ పరిపాలన శాఖలు ఈ విధానం లో ముందoజలో ఉన్నందుకు అభినందించారు. ఇతర శాఖలు కూడా e-office సిస్టం క్రింద పనిచేసేలా చూడాలని ఆదేశించారు.
ఈ విధానం ద్వారా పారదర్శకత ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. దీని వల్ల అనవసర కాగితాల పని మరియు చాలా సమయం ఆదా అవుతుందని అన్నారు. ప్రతి ఫిర్యాదు, దరఖాస్తుకు జవాబుదారీతనమునకు ఈ విధానము చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
e-office సిస్టం ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా ఫైళ్ళు పరిష్కరించ బడతాయి. ఈ విధానం కాగితరహితంగా ఉంటుంది. ఈ విధానం ద్వారా కాగితాల తో పనిలేకుండా సురక్షితంగా పనిచేయడానికి వీలు అవుతున్నందున అధికారులు, ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, ఎస్.సి. డెవలప్ మెంట్ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జ, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజు డైరెక్టర్ శ్రీ సర్ఫ్ రాజ్ అహ్మద్, ఫైనాన్స్ సెక్రటరీ శ్రీ రోనాల్డ్ రోజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీమతి దివ్య, ప్రధాన కమీషనర్, భూ పరిపాలన శాఖ శ్రీ రజత్ కుమార్ షైనీ పాల్గొన్నారు.













