వెంటనే ఆ నిధులు ఇప్పించండి : భట్టి విక్రమార్క

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను వివరించి సాయం చేయాలని కోరామని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అసంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇంకా రాలేదు. వెంటనే ఇప్పించే విధంగా చూడాలని కోరాం. 2014-15లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మొత్తం నిధులను ఆంధ్రప్రదేశ్ ఖాతాలోనే వేశారు. తెలంగాణ వాటా నిధులు తిరిగి ఇవ్వాలని కోరాం. 2019 నుంచి 2024 సంవత్సరాలకు సంబంధించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధులు రాష్ట్రానికి రాలేదు. ఆ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని అడిగాం. వెంటనే స్పందించి పెండింగ్ అంశాలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన 8 అంశాలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపిస్తామని తెలిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రికి ఈ సందర్భంగా భట్టి ధన్యవాదాలు తెలిపారు.