బైపాస్ ఆపరేషన్లులో అమెరికా తర్వాత మనమే
అమెరికా తర్వాత భారతదేశంలోనే అత్యధికంగా ఏటా 1.4 లక్షల మందికి కరోనరీ అర్టరీ బైపాస్ ఆపరేషన్లు జరుగుతున్నాయని స్టార్ ఆస్పత్రి సీనియర్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా వెల్లడించారు. వారం క్రితం న్యూయార్క్లో జరిగిన అంతర్జాతీయ కరోనరీ ఆర్టరరీ సదస్సులో పాల్గొని వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో పది లక్షల మంది కరోనరీ ఆర్టరీ సమస్యతో బాధపడుతున్నారని, వారిలో కనీసం 4-5 లక్షల మందికి శస్త్ర చికిత్స అవసరమని చెప్పారు. 1-2 లక్షల మంది స్టంట్లతో, మిగిలిన వారు మందులతో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. పెరిగిన సాంకేతిక వైద్య పరిజ్ఞానంతో దేశంలో హృద్రోగ మరణాలు తగ్గుముఖం పట్టాయని, శస్త్ర చికిత్సలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు.
గతంలో కరోనరీ ఆర్టరీ బైపాస్ శస్త్రచికిత్స చేయించుకోవాలంటే విదేశాలకు వెళ్లే వాళ్లమన్నారు. ఇపుడు మన దేశంలో అవలంభిస్తున్న గుండె శస్త్రచికిత్స విధానాలను ఇతర దేశాల వారు అనుసరిస్తున్నారని, మన మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటున్నారని చెప్పారు. సజ్జా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు దశబ్దాల కాలంలో 11,697 మందికి కరోనరీ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వెల్లడించారు. కరోనరీ ఆపరేషన్ల మీద తమ ఫౌండేషన్ ఒక అధ్యయనం నిర్వహించగా బాధితుల్లో 87శాతం పురుషులేనని తేలిందన్నారు.













