తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… అనాథ పిల్లలకు

కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనాథ పిల్లల భద్రత దృష్ట్యా వారి సమస్యలను అధికారులు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు వీలుగా అనాథ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అందించాలని మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ ఫోన్లలో జిల్లా శిశు సంరక్షణ శాఖ అధికారితో పాటు పలువురు అధికారుల ఫోన్ నంబర్లు, హెల్ప్ లైన్, ఎమర్జెన్సీ నంబర్లను కాంటాక్టు జాబితాలో ఫీడ్ చేసి అనాథ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవాల్వని నిర్ణయించినట్లు హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి అకేశ్వరరావు తెలిపారు.
ఈ ఫోన్లు తీసుకున్న అనంతరం అనాథ పిల్లలు ఏదైనా సాయం కోసం అధికారులను సంప్రదించవచ్చు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే కొవిడ్ బారినపడి తల్లిదండ్రులు మరణించడంతో 85 మంది పిల్లలు అనాథలయ్యారు. దీంతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన అనాథలు సైతం ఉన్నారని అధికారులు తెలిపారు. మొత్తం 138 మంది అనాథ పిల్లలున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ అనాథ పిల్లలందరికీ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నెలవారీగా రేషన్ కిట్స్ అందించాలని నిర్ణయించారు. సంరక్షకులు లేని అనాథ పిల్లలను చైల్డ్ హోంలకు తరలించారు. వీరందరికీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి చదువు చెప్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.