Kishan Reddy: దేశవ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం : కిషన్ రెడ్డి
హైదరాబాద్ శివారు బీబీనగర్లో రూ.1300 కోట్లతో ఎయిమ్స్ ఆస్పత్రి (AIIMS Hospital) నిర్మిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రి (RIMS Hospital)లో రూ.23.75 కోట్ల నిధులతో నిర్మించిన క్రిటికల్ కేర్ 50 పడకల ఆస్పత్రిని రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో పాటు పీజీ సీట్లను పెంచుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మంచిర్యాల టు నాగపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే, ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వేలైన్ నిర్మాణానికి సర్వే కొనసాగుతోందన్నారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో సోయాబీన్ పంట దెబ్బతిన్నదని, ఈ విషయంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. మార్చి చివరి వరకు పత్తి పంట కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.






