కాళేశ్వరం బీఆర్ఎస్కు.. మూసీ కాంగ్రెస్కు : బండి సంజయ్

మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతలపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఏటీఎంలా వాడుకుంది. మూసీని కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకోవాలనుకుంటోంది. ఈ ప్రాజెక్టు పేరుతో లక్షన్నర కోట్లు అప్పు చేయడం దుర్మార్గం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. వడ్డీల రూపంలో 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు చెల్లించారు. పాలకులు చేస్తున్న అప్పులతో ప్రజలపై భారం పడుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ దోపిడీ, పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్రమే వ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం ఇందిరాపార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపడుతున్నాం అని తెలిపారు.