సాగర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు.. కేసీఆర్

టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ విశ్వాసాన్ని ప్రస్పుటంగా ప్రకటించిన నాగార్జునసాగర్ నియోజవకర్గ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ను కలుస్తానని అన్నారు. నాగార్జున సాగర్ నియోజక వర్గాన్ని సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు సేకరించిన ప్రజా సమస్యన్నింటినీ సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలో ఇటీవల మంజూరు చేసిన ఎత్తిపోత పథకాన్ని శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు నీరందిస్తామని స్పష్టం చేశారు. చక్కగా ప్రజా సేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని నోముల భగత్కు ముఖ్యమంత్రి సూచించారు. విజయం సాధించిన భగత్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. భగత్ విజయం కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.