కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
కెనడా పర్యటనకు సీఎం నేతృత్వంలోని బృందానికి ఆహ్వానం
కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులను తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు ఆహ్వానించిన సీఎం
రాష్ట్ర ప్రగతి దిశ, ఉద్యోగ కల్పనపై ప్రశంసలు కురిపించిన కెనడా హైకమిషనర్
హైదరాబాద్: కెనడా హైకమిషనర్ టు ఇండియా క్రిస్ కూటర్ బుధవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెనడా-తెలంగాణ మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందాన్ని కెనడా పర్యటనకు రావాలని హైకమిషనర్ క్రిస్ కూటర్ ఆహ్వానించారు. ఈ సమావేశంలో తెలంగాణలో చేపడుతున్న భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది.
ముఖ్యంగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ప్రతిష్ఠాత్మకంగా ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను ఇరువురు చర్చలు జరిపారు. తెలంగాణ-కెనడా మధ్య పెరుగుతున్న పారిశ్రామిక, ఆర్థిక సంబంధాలను ప్రస్తావించిన క్రిస్ కూటర్, ఇటీవల కెనడాకు చెందిన ప్రముఖ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్, హైదరాబాద్లో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, సీఐబీసీ (సీఐబీసీ) హైదరాబాద్లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించడం వంటి పరిణామాలు తెలంగాణపై కెనడా కంపెనీల నమ్మకం, విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. దాంతోపాటు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్యాపిటల్ సంస్థ సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్కు చెందిన సీటీఆర్ ఎల్ఎస్(CtrlS) డేటా సెంటర్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుని ఒక బిలియన్ కెనడియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం తెలంగాణ పెట్టుబడి సామర్థ్యాన్ని మరింత బలపరిచిందని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఐటీ, లైఫ్ సైన్సెస్, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో సాధించిన పురోగతిని క్రిస్ కూటర్ బృందానికి వివరించారు. ముఖ్యంగా ప్రపంచంలోని ఫార్చ్యూన్-500 కంపెనీల గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు) హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. మూసీ నది పునరుద్ధరణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని సీఎం రేవంత్ వివరించారు. నదీ తీరాన్ని అభివృద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
అలాగే రాష్ట్రంలో సౌర విద్యుత్ విస్తరణ, హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కెనడా సహకారం అందించాలని కోరారు. తెలంగాణను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం వెల్లడించారు. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ఇదే తరహాలో కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు కలిసి హైదరాబాద్లో మల్టీ-యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.
ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించనున్న రెండో తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో పాల్గొనాలని కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలో కొత్త పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు ఇది మంచి వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన హైకమిషనర్ క్రిస్ కూటర్, తెలంగాణ ప్రభుత్వం దూరదృష్టితో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. ఉద్యోగాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అనుసరిస్తున్న విధానం ఆదర్శప్రాయమని కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులైన యువశక్తి తెలంగాణకు మరింత బలం చేకూరుస్తోందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కెనడా అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చిన క్రిస్ కూటర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కెనడా పర్యటనకు ఆహ్వానించారు. రాబోయే నెలల్లో కెనడా వాణిజ్య ప్రతినిధి బృందం తెలంగాణకు వచ్చి ఇంధన రంగం, పట్టణాభివృద్ధి, రక్షణ, ఏరోస్పేస్ తదితర రంగాల్లో పెట్టుబడులు, భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చిస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఐటీ,ఈ అండ్ సీ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.








