సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు
ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి వర్తింపు
హాస్టళ్లు కాదు…ఇక గురుకులాలనే నిర్మిద్దాం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు
సంక్షేమ శాఖల విద్యాసంస్థల్లో చదివిన పూర్వ విద్యార్థుల నెట్ వర్కింగ్
రూ.100 కోట్లతో హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల మరమ్మత్తులు
బడుగుల జీవనోపాధికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులకు పీ4 అనుసంధానం
బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇస్తున్న డైట్ ఛార్జీల్లో 10 శాతం పెంచాలని ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్ష సందర్భంగా విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినా… ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపజేయాలని సీఎం స్పష్టం చేశారు. బలహీనవర్గాల విద్యార్థుల కోసం డైట్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుంది. దీనికి తగినట్టుగానే వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలి. మెరుగైన విద్య, మౌళిక సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకే డైట్ ఛార్జీలు పెంచుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు లబ్ది చేకూర్చే విషయంలో వారికి కలిగే ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు
సంక్షేమ శాఖలకు చెందిన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దాలని వ్యాఖ్యానించారు. ‘హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలి. రెసిడెన్షియల్ స్కూళ్లల్లో నెట్జీరో విధానాన్ని అమలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో విశ్లేషించాలి. బయో డైవర్శిటీ పార్కుల తరహాలో గురుకులాలను నిర్వహించాలి. మెరుగైన వసతులు, మౌళిక సదుపాయాలతో గురుకులాలను నిర్మిద్దాం. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల మెయింటెనెన్స్ గ్రాంట్ ఇవ్వాలి. దీని నిమిత్తం రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం. హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులను ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇప్పించాలి. పోటీ పరీక్షలకు గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థులను సిద్ధం చేయాలి. విద్యతో సమానంగా శిక్షణ అందించాలి. బెస్ట్ టీచర్స్ నియమించి క్వాలిటీ ట్రైనింగివ్వాలి. హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనబరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఈ మేరకు పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ప్రారంభించండి. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను మ్యాపింగ్ చేసి… నైపుణ్యం పెంచి పారిశ్రామిక అవసరాలకు వర్క్ఫోర్స్ సిద్దం చేయాలి. హాస్టళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఓ వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయాలి. సంక్షేమ హాస్టళ్లను ఎన్ఆర్ఐలు అడాప్ట్ చేసుకునేలా వారితో సంప్రదింపులు జరపాలి. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల నెట్ వర్కింగ్ చేయాలి. రెసిడెన్షిల్ స్కూళ్లు, గురుకులాల్లో స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి విద్యా, వైద్య సేవలు అందించే వాళ్లకి అవకాశం కల్పించాలి.”అని ముఖ్యమంత్రి సూచించారు.

పథకాల లబ్ది పేదలకు అందాలి
“పేదలు, బలహీన వర్గాలకు సంక్షేమం అందించడమే కాదు… వారి జీవనోపాధిని మెరుగు పరిచి… మరింత ఆదాయాలు సమకూర్చేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వం వైపు నుంచి అందించే సంక్షేమం, మెప్మా, డ్వాక్రా పథకాల ద్వారా ఉపాధి కల్పించడంతోపాటు… పీ4 ద్వారా సాయం అందాలి. వ్యవసాయం, ఉద్యానరంగం, పాడి పరిశ్రమ, జీ రామ్ జీ సహా వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేకూర్చాలి. సాస్కీ, పూర్వోదయ, జీ రామ్ జీ వంటి పథకాల లబ్ది బడుగు వర్గాలకు దక్కేలా చూడాలి. ఉద్యాన, రబ్బర్, కాఫీ, పసుపు వంటి పంటల సాగును ప్రోత్సహించి ఆ వర్గాల రైతులకు లబ్ధి కలిగేలా చూడాలి. ఇప్పటికే కొన్ని విధానాల ద్వారా వారి జీవన స్థితిగతులను మెరుగు పరిచేలా పాలసీలు తీసుకున్నాం. లిక్కర్ షాపుల్లో కల్లుగీత వృత్తిదారులకు, క్వారీల్లో వడ్డెర్లకు కోటా పెట్టాం. నాయీ బ్రహ్మాణులు, మత్స్యకారులు, చేనేత కార్మికులకు ఇలా వివిధ వర్గాలకు ఆర్థికంగా సాయం చేస్తున్నాం. ప్రభుత్వ పరంగా అందించే సాయమే కాకుండా… వారి అభివృద్ధికి ఏమేం చర్యలు తీసుకోవానే అంశంపై ప్రతిపాదనలు సిద్దం చేయండి. ఈ మేరకు వివిధ కుల కార్పొరేషన్ల బై లాస్ మార్చే అంశాన్ని పరిశీలించండి. బ్రాహ్మణ కార్పొరేషన్ విధానాలను మిగిలిన కార్పొరేషన్లు కూడా అవలంభించేలా చర్యలు తీసుకోవాలి. జీ రామ్ జీ ద్వారా అంగన్వాడీ భవనాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. ఈ సమీక్ష సందర్భంగా సంక్షేమ శాఖల్లో తాము తీసుకున్న చర్యలను మంత్రులు, అధికారులు వివరించారు. కొందరు విద్యార్థులు హోం సిక్కు గురవుతున్నారని.. అలాంటి విద్యార్థుల కోసం తల్లిదండ్రులతో మాట్లాడేలా స్మార్ట్ కార్డ్ బేస్డ్ టెలీఫోన్ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లిదండ్రులతో రోజులో 4 నిమిషాలు మాట్లాడుకునే సదుపాయం కల్పంచామని తెలిపారు. సాస్కి కింద సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్పేర్ స్కూళ్లలో రూ.120 కోట్లతో ఆర్వో పాంట్లు, టాయిలెట్స్ సహా ఇతర మౌళిక వసతులను కల్పించే పనులు చేపట్టామని వివరించారు. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేశామని… ఈ నెలాఖరు నాటికి టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు వివరించారు. సమీక్షలో మంత్రులు డీబీవీ స్వామి, సవిత, సంధ్యారాణి, ఎన్ఎండీ ఫరూక్, మైనార్టీ సంక్షేమ సలహాదారు మహ్మద్ షరీఫ్ సహా వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.








