శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టామని, అది రాత్రి 7 గంటలకు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కు మెయిల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన బాండ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు విమానాశ్రయం మొత్తం తనిఖీలు నిర్వహించారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కొద్ది సేపటికే మరో ఐడీతో ఎయిర్పోర్ట్ అధికారులకు మరో మెయిల్ వచ్చింది. తప్పు జరిగిందని, తన కుమారుడు ఫోన్తో ఆడుకుంటూ మెయిల్ పెట్టాడని పేర్కొన్నారు. తనను క్షమించాలని కోరాడు. కాగా, ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ చేసిన వ్యక్తి గురించి గాలిస్తున్నట్లు తెలిపారు.













