దేశమంతా ఇదే సమస్య : అనిల్ కూర్మాచలం
పోతిరెడ్డిపాడు పాపం నాటినుంచి నేటివరకు పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వాలదేనని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం విమర్శించారు. నదీ జలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వాలు పూర్తి విఫలమయ్యాయని, దేశమంతా ఇదే సమస్య ఉన్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోరాటం చేయాల్సింది కేంద్రం పైనేనని సృష్టం చేశారు. పోతిరెడ్డి పాడు ద్వారా అక్రమంగా కృష్ణా నీళ్లు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్ తీరును ఆయన ఖండించారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఏపీ కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం సరికాదని, అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే టీఆర్ఎస్ పార్టీ ఉపేక్షించదని సృష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో మాదిరే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నేడు కృష్ణజలాల వివాదంపై ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి సీఎం కేసీఆర్ పిలుపునిస్తే ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.













