తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ ఇప్పటికీ … ఓవైసీ చేతిలోనే : అమిత్ షా

మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసినట్టే కాంగ్రెస్ కూడా చేస్తోందని ఆరోపించారు. ఈ పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. తెలంగాణలో 10 ఎంపీ సీట్లు తప్పక గెలుస్తున్నాం. 11 చోట్ల విజయావకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 400 సీట్లు వస్తాయని మాకు పూర్తి విశ్వాసం ఉంది. మోదీ ప్రధానిగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. మోదీ పాలనలో ఉగ్రవాద దాడులు లేవు. తెలంగాణలో రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నిర్మించాం. సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేశాం. ఇలా ఎన్నో కీలక సంస్థలను నెలకొల్పాం. తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ ఇప్పటికీ ఓవైసీ చేతిలోనే ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకావడం లేదు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. అదీ లేదు. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి, ఇవ్వలేదు. కౌలు రైతులకు రూ.15 వేల ఆర్థిక సాయం లేదు. విద్యార్థులకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ ద్రుష్పచారం చేస్తోంది. నా వీడియోను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేశారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తారు అని అన్నారు.