తెలంగాణతో పాటు తమిళనాడులో ఎయిమ్స్ ఏర్పాటు
తెలంగాణతో పాటు తమిళనాడులో ఎయిమ్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తెలంగాణకు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)ను కేటాయించాలని నిర్ణయించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ సమీపంలోని బీబీనగర్లో ఎయిమ్స్ ను ఏర్పాటు చేయాలని గతంలోనే సూత్రప్రాయంగా నిర్ణయించినా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించడం, దీనికి సంబంధించి ప్రకటనను జారీ జరిగింది. బీబీనగర్లో 1,028 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తారు.
రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం బీబీనగర్లో నిమ్స్ కోసం నిర్మించిన భవన సముదాయంలో ఎయిమ్స్ను ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడీ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. ప్రధాన మంత్రి స్వాత్స్య సురక్షా యోజన కింద ఎయిమ్స్ ఏర్పాటు చేస్తారని కేంద్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది. బీబీనగర్ ఏయిమ్స్ లో వంద సీట్లతో కూడిన ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీతో పాటు 60 సీట్ల బీఎస్సీ నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తారు. ఎయిమ్స్ లో ప్రతిరోజూ 1500 మంది అవుట్ పేషంట్లు, ప్రతినెలా వెయ్యి మంది ఇన్ పేషంట్లకు చికిత్స చేస్తారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో 750పడకలతో కూడిన ఆసుపత్రిని ఏర్పాటు చేస్తారు.













