ఫిబ్రవరి 22 నుంచి హైదరాబాద్ లో బయో ఏషియా
ఫార్మా, హెల్త్కేర్, బయోటెక్నాలజీ రంగానికి సంబంధించిన కీలకమైన అంతర్జాతీయ సదస్సు బయో ఏషియా 2018 వచ్చే నెల 22 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్లో జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా గత పదిహేనేళ్లుగా ఈ సదస్సును నిర్వహిస్తున్నది. ఈసారి సదస్సుకు దాదాపు 55 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపారు. ఈ సదస్సుకు ఐర్లాండ్, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా అంతర్జాతీయ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. గుజరాత్, అసోం, రాజస్తాన్ దేశీయ భాగస్వాములుగా ఉంటాయి. హైదరాబాద్ గత కొద్ది ఏళ్లలో ఫార్మా, లైఫ్ సైన్సెస్కు సంబంధించి అతి పెద్ద హబ్గా అవతరించిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జినోమ్ వ్యాలీ ప్రపంచంలోనే ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చెందిన అతిపెద్ద ఆర్అండ్డి, క్లీన్ మాన్యుఫాక్చరింగ్ కేంద్రంగా జినోమ్ వ్యాలీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నదని ఆయన అన్నారు.













