ఫిబ్రవరి 22 నుంచి బయో ఏషియా సదస్సు
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులపై ఏటా నిర్వహించే బయో ఏషియా సదస్సు ఫిబ్రవరి 22, 23 తేదీల్లో జరుగనున్నది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సదస్సును తొలిసారి వర్చువల్ విధానంలో జరుపాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి.. బయో ఏషియా వైబ్సైట్, ఇతివృత్తాన్ని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్లో ఆవిష్కరించారు. 50 దేశాల నుంచి 1500 మంది శాస్త్రవేత్తలు, ప్రముఖులు పాల్గొనే ఈ సదస్సుకు మూవ్ ది నీడిల్ అన్న ఇతివృత్తాన్ని ప్రధానంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న మార్పులు, ఎదురవుతున్న సవాళ్లు, వాటికి పరిష్కారాలపై సదస్సులో విస్తృతంగా చర్చిస్తారని వెల్లడించారు. కొవిడ్ 19 నేపథ్యంలో సదస్సును తొలిసారి వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.
విశ్వవ్యాప్తంగా ఉన్న లైఫ్సైన్సెస్ రంగ ప్రముఖులు సదస్సులో పాల్గొని సలహాలు, సూచనలివ్వాలని పిలుపునిచ్చారు. ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ మాట్లాడుతూ కొవిడ్ను దృష్టిలో ఉంచుకొని సదస్సుకు ఇతివృత్తంగా మూవ్ ది నీడిల్ను నిర్ణయించినట్లు చెప్పారు. బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్ మాట్లాడుతూ లైఫ్సైన్సెస్ రంగంలో ప్రపంచస్థాయిలో ప్రముఖమైనదిగా బయో ఏషియా సదస్సు ప్రసిద్ధి చెందిందని తెలిపారు. సదస్సును వివిధ మాధ్యమాల ద్వారా 30 వేల మంది మీక్షించే అవకాశం ఉన్నదని చెప్పారు. సదస్సు భాగస్వామ్య పక్షాలుగా ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయెటెక్ అసోసియేషన్స్ (ఎఫ్ఏబీఏ), ఎర్నస్ట్ అండ్ యంగ్ ఎల్ఎల్పీ సంస్థలు ఉన్నాయి.













