CM Revanth Reddy: పాతబస్తీకి మెట్రో వచ్చి తీరుతుంది.. మజ్లిస్తో చర్చిస్తాం: సీఎం రేవంత్

హైదరాబాద్లోని పాతబస్తీ అభివృద్ధి గురించి, ఆ ప్రాంతంలో మెట్రో విస్తరణ గురించి మజ్లిస్ పార్టీతో చర్చలు జరుపుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ మార్గంలో బెంగళూరు హైవే వరకు ఉన్న ట్రాఫిక్ను నియంత్రించడం కోసమే జూపార్క్ నుంచి ఆరాంఘర్ వరకు 4.08 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్ నిర్మించినట్లు ప్రకటించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.800 కోట్లు ఖర్చయిందని, దీనికి ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును పెట్టామని తెలియజేశారు.
వైఎస్సార్ హయాంలో నిర్మించిన 11.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ అనంతరం.. ఈ ఫ్లైఓవరే నగరంలో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని వివరించారు. హైదరాబాద్ నగర అభివృద్ధే.. తెలంగాణ అభివృద్ధి అని చెప్పిన రేవంత్ (CM Revanth Reddy).. ప్రస్తుతం నగరంలో రోడ్ల విస్తరణ, మెట్రో నిర్మాణం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఆక్రమణల వల్ల హైదరాబాద్ సుందరీకరణ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కావాలని ప్రధాని మోదీని అడిగామని తెలిపారు.
హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి పనిచేస్తాయని సీఎం (CM Revanth Reddy) స్పష్టం చేశారు. త్వరలోనే మజ్లిస్ ఎమ్మెల్యేలను పిలిచి హైదరాబాద్ అభివృద్ధి, పాతబస్తీ మెట్రోపై చర్చలు జరుపుతామన్నారు. పాతబస్తీకి కచ్చితంగా మెట్రో వచ్చి తీరుతుందని హామీ ఇచ్చారు.