కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత, సెప్టెంబరు 26వ తేదీ నుంచి తిరుపతిలో ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తామని ఆయన తెలిపారు.
తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమాయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని చైర్మన్ వివరించారు. కోవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. అక్టోబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని తెలిపారు.













