Amaravati: అమరావతి ముఖ ద్వారం కోసం ముస్తాబు అవుతున్న మూలపాడు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి (Amaravati) సంబంధించిన ఒక కీలక పరిణామం ప్రస్తుతం అందరి దృష్టి ఆకర్షిస్తోంది. అమరావతి అభివృద్ధిలో భాగంగా ముఖ్య ద్వారం ఎక్కడ ఏర్పాటు చేయాలన్న చర్చలో ఇప్పుడు మూలపాడు గ్రామంకు (Mulapadu) ప్రాధాన్యత వచ్చింది. ఇది కృష్ణా జిల్లా లోని ఇబ్రహీంపట్నం మండలంలో (Ibrahimpatnam Mandal) ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ గ్రామం రాజధాని ప్రధాన ప్రవేశ ద్వారంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇప్పటికే అమరావతి అభివృద్ధి కోసం 34,000 ఎకరాలకు పైగా భూములు రైతుల నుంచి సేకరించారు. అయితే రాజధానిలోకి వెళ్లే ప్రధాన మార్గాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే విషయంపై చర్చలు జరిగినప్పుడు, మూలపాడు ప్రాంతం అధికారులు, ప్రజాప్రతినిధులకు అనుకూలంగా కనిపించిందట. ముఖ్యంగా, హైదరాబాద్ (Hyderabad) – విజయవాడ (Vijayawada) జాతీయ రహదారికి దగ్గరగా ఉండడం వల్ల, ఈ మార్గం చాలా సులభతరం అవుతుంది.
ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) చంద్రబాబుకు , CRDA అధికారులకు ఈ ప్రతిపాదనపై వివరాలు సమర్పించారు. దీంతో ప్రభుత్వం కూడా ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ ద్వారం ఇక్కడ ఏర్పడితే, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వారికి ఇది రాజధాని లోకి సులభమైన ప్రవేశద్వారం అవుతుంది. అలాగే, గుంటూరు (Guntur) లేదా ఉండవల్లి (Undavalli) నుంచి వచ్చే వారికి మాత్రం ప్రస్తుతం కరకట్ట మీదుగా ఉన్న దారిని వాడాల్సవస్తుంది. దానిని మరింత అభివృద్ధి చేసి ఆరు లేన్ల రహదారిగా మార్చే యోచనలో ఉన్నారు.
ఇక మూలపాడులో ఏర్పాటు చేయనున్న ఐకానిక్ బ్రిడ్జి (Iconic Bridge) ఒక విశిష్ట నిర్మాణంగా ఉండనుంది. ప్రస్తుతం భూసార పరీక్షలు జరుగుతున్నాయని సమాచారం. ఇది పూర్తయిన వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతికి వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ద్వారంపైనే ప్రవేశించాల్సి రావడం వల్ల, ఈ గ్రామం భవిష్యత్లో ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ కార్యకలాపాలకు కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఈ కొత్త మార్గం అమరావతికి కీలకంగా మారుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మూలపాడు గ్రామానికి ఇది మహర్దశను తెస్తుందనే విశ్వాసాన్ని అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఇది ఒక పెద్ద అడుగు కానుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది.