ఫిషరీస్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లు వచ్చే ఏడాదే…
ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురంలో ఏర్పాటు కానున్న ఫిషరీస్ యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్తిచేయడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉండడంతో రాబోయే విద్యాసంవత్సరం (2022-2023) నుంచే ఆయా కోర్సుల తరగతులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తాత్కాలిక అద్దె భవనాల పరిశీలన కోసం నరసాపురం ఫిషరీష్ యూనివర్సిటీ ప్రత్యేక అధికారి ఓ.సుధాకర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం నరసాపురంలో పర్యటించింది.
పట్టణంలోని పీచుపాలెం, పాతనవరసపురం ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న రెండు ఇంజనీరింగ్ కళాశాలలను ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో కలిసి పరిశీలించారు. భవనాల పరిశీలన అనంతరం ఎమ్మెల్యే ప్రసాదరాజు తన నివాసంలో అధికారుల బృందంతో సమావేశం నిర్వహించారు. వర్సిటీ కోసం ముందుగా మంజూరైన రూ.100 కోట్లతో అకడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, బాయ్స్, గరల్స్ హాస్టల్ బ్లాకులను సరిపల్లిలో నిర్మించాల్సి ఉందన్నారు. అన్ని అనుమతులు మంజూరైన దృష్ట్యా వెంటనే టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిదిగా, దేశంలో మూడోదిగా నిర్మితమవుతున్న ఫిషరీస్ యూనివర్సిటీ దేశానికే తలమానికంగా నిలవాలని ఆయన చెప్పారు.













