వారంతా ఇక జైలుకే.. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరికైనా : లోకేశ్
దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ చూస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. స్వయంగా సీఎం సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొందన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఉద్యమాల పోరాటల గడ్డ ఉత్తరాంధ్ర. ఎన్ని కేసులు పెట్టినా భయపడని కార్యకర్తలకు నా వందనం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కారణం దొంగ ఓట్లే. వాటిని నమోదు చేస్తున్న వారిపై చర్యలు తప్పవని ఆనాడే చెప్పా. ఏకంగా డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. రేపో మాపో విచారణ నివేదిక బయటకొస్తుంది. వారంతా ఇక జైలుకే. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరికైనా శిక్ష తప్పదు అని హెచ్చరించారు.













