ప్రత్యేక హోదా కాకపోతే.. ప్రత్యేక నిధులు : మనోహర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్కామ్గా మార్చిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు భరోసాకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయని తెలిపారు. కౌలు రైతుల సమస్యలను సీఎం జగన్ గుర్తించలేకపోతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొని డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు. అమరావతినే రాజధానని స్పష్టంగా చెప్పాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని కేంద్రానికి చెప్పామన్నారు. ప్రత్యేకహోదా కాకపోతే ప్రత్యేక నిధులు తేవాలని డిమాండ్ చేశారు. అమలాపురం ఘటనపై కేంద్రమంత్రి అమిత్షాకు లేఖ రాశామని తెలిపారు. అసత్యాలు చెప్పినందుకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.













