మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడాలి
వైసీపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. వైసీపీ అరాచక పాలనకు మున్సిపల్ ఎన్నికల నుంచే చరమగీతం పాడాలని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. వైసీపీ దౌర్జన్యాలు చేస్తున్నా ప్రజల కోసం టీడీపీ పోరాడుతూనే ఉందని అన్నారు. వైసీపీ అధికారం రాకముందు ఎలా ఉంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందనేది ప్రజలు గుర్తించారన్నారు. జగన్ ప్రభుత్వం వ్యవస్థలన్నీ బ్రస్టు పట్టించిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెనాలిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి ఆలపాటి రాజా పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి ఆలపాటితో కలిసి ఎంపీ గల్లా అభ్యర్థించారు.













