ఎపి రాజ్యసభ బరిలో ఐదుగురు
రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వచ్చే నెలతో నలుగురు అభ్యర్థుల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో నాలుగు స్థానాలకు ఖాళీ ఏర్పడింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులుగా మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వర్ల రామయ్య పోటీలో ఉన్నారు. ఈ నెల 13న నామినేషన్ల స్వీకరణకు గడువు కాగా బుధవారంతో ఉపసంహరణల గడువు ముగిసింది. దీంతో వైసీపీ తరపున నలుగురు, టీడీపీ తరపున ఒకరు రంగంలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాలక •ష్ణమాచార్యులు ప్రకటించారు. మొత్తం ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నందున ఎన్నిక అనివార్యమైంది.
ఈ నెల 26న అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్నిక జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 23మంది ఉన్నారు. అయితే వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరారు. తెలుగుదేశం పార్టీలో తటస్థులుగా ఉంటూనే అధికార పక్షానికి ఈ ముగ్గురు మద్దతిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా విప్ జారీ చేసి వలసలకు చెక్పెట్టే యోచనలో ఉంది. అయితే అధికార పార్టీ వీరిని తటస్థులుగానే పరిగణిస్తూ ఎన్నికల సందర్భంగా వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు పావులు కదుపుతోంది. టీడీపీ నుంచి వలస వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు వైసీపీకి టచ్లో ఉన్నారని, రాజ్యసభ ఎన్నికల అనంతరం చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనేదే అధికార పార్టీ వ్యూహంగా చెపుతున్నారు.
గతంలో వైసీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలను చేరదీసి వారిపై అనర్హత వేటు వేయలేదని, ఇదే తరహాలో వైసీపీలోకి వలస వచ్చినవారి విషయంలో ఆచితూచి అడుగేయాలని అధికార పార్టీ భావిస్తోంది. టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్యను పోటీలో నిలపటం వెనుక వలస ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలనే డిమాండ్ చేయాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలిసింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ, ఆంగ్ల మాధ్యమం బిల్లుల్ని శాసనసభలో ప్రవేశపెట్టిన సమయంలో వల్లభనేని వంశీ, మద్దాలి గిరి శాసనసభకు హాజరైనా ఓటింగ్ సమయంలో సభలో లేరు. అయితే రాజ్యసభకు ఓటింగ్ తప్పనిసరి కావటంతో అనర్హత అంశంపై సీరియస్గా టీడీపీ కసరత్తు జరుపుతోంది.













