వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హొమ్ మంత్రి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులు ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షాలు, వరదలపై అధికారులు, మంత్రులతో సమీక్ష జరిపిన విషయం తెలిసిందే. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా కేంద్రానికి లేఖ సైతం రాశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4450 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ అవసరా కింద వెంటనే రూ.2250 కోట్లు సాయం అందించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ కేంద్రాన్ని కోరారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పలు అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్షాకు రాసిన లేఖలో ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని అమిత్ షా దృష్టికి తీసుకుపోయారు.













