ఆ బాధ్యత ప్రజలు ఎన్డీయేకు అప్పగించారు : సీఎం చంద్రబాబు
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ భేటీ అనంతరం ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాలో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీయేకు అప్పగించారన్నారు. పోలవరానికి సంబంధించి పాతబకాయిలు ఇవ్వాలని కోరామని తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కేంద్రం నిధులను దారి మళ్లించిందని, ఇదే విషయాన్ని కేంద్రంలోని ఆయా శాఖలు చెబుతున్నాయన్నారు. నవంబర్ నాటికి పోలవరం నిధులు విడుదల చేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు.













