రైతు భరోసా పై భరోసా ఇచ్చిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి..
ఆంధ్రాలో రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గత ప్రభుత్వము లాగా కాకుండా ఈసారి అన్నదాతకు అన్ని విధాల అండదండగా తమ ప్రభుత్వం నిరుస్తుంది అన్న భరోసాన్ని ప్రకటించింది. శాసనమండలి వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. గత ప్రభుత్వం వెబ్ ల్యాండ్ పేరుతో రైతు భరోసా పథకాన్ని ఎగ్గొట్టిందని ఆయన ఆరోపించారు. అటువంటి పొరపాట్లు జరగకుండా చేస్తామని భరోసా ఇవ్వడంతో పాటు రైతులకు సంబంధించిన భూముల వివరాలను వెబ్ ల్యాండ్ లో ఉంచుతామని తెలిపారు. కౌలు రైతు చట్టాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడంతోపాటు ప్రతి కవులు రైతుకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పరిహారాలు అందిస్తామని తెలియపరిచారు.
గత ప్రభుత్వం భీమా పేరుతో రాష్ట్రంలోని రైతులను మోసం చేసింది అని విమర్శించిన అచ్చెన్నాయుడు.. మొత్తం భీమా వ్యవస్థనే వైసిపి ప్రభుత్వం నాశనం చేసింది అని విమర్శించారు. ప్రీమియంలు సకాలంలో చెల్లించకుండా నిర్లక్ష్య ధోరణితో వైసిపి ప్రభుత్వం వ్యవహరించడంతో రైతులు తీవ్ర నష్టం చవి చూశారని ఆయన తెలియపరిచారు. ఖరీఫ్ ,రబీ సీజన్ లలో కేవలం ఒక్క సీజన్ కు మాత్రమే భీమా ప్రీమియం చెల్లించారని ఆయన వ్యాఖ్యానించారు.
రైతు బీమా అమలుపై సీఎం చంద్రబాబు ఓ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని అచ్చెన్నాయుడు తెలియపరిచారు. అంతేకాదు త్వరలోనే బీమా అమలు చేయడానికి ఉత్తమమైన విధానాన్ని ఎంపిక చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కు గాను పాత విధానాన్ని అమలు చేయబోతున్నామని.. రబీ సీజన్ నుంచి కొత్త పాలసీలు అమలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతు భరోసా పథకం పేరును ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవగా మార్చిన విషయాన్ని తెలియపరిచారు.
గత ఐదేళ్ల పాలనలో ఎన్నో అవకతవకలు జరిగాయని.. వాటిలో అన్నదాతలు ఎక్కువ నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకి సంవత్సరానికి 20వేల రూపాయల సాయం అందివ్వబోతున్నట్లు ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చిందని. ఆ హామీకి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ 20 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనతో కలిపి అమలు చేస్తారా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.













