కేంద్ర బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది: ఏపీ మంత్రి మాణిక్యాలరావు
అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని ఏపీ మంత్రి మాణిక్యాలరావు కేంద్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. శుక్రవారం మధ్యాహ్నం ఓ చానెల్తో మాట్లాడిన ఆయన.. దేశంలోని అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఏపీని చూస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాలు వేరు, ఏపీ వేరు అనడం సరికాదని ఆయన చెప్పుకొచ్చారు. బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని ప్రజల్లోకి వెళ్లి చెప్పగలమని మంత్రి అన్నారు. డీపీఆర్ లేనందనే రాజధాని నిధులు ఇవ్వలేదని మాణిక్యాలరావు చెప్పారు. ఏపీకి అన్యాయం జరిగిందనేది మిత్రపక్షంలోని కొందరి వాదన మాత్రమేనన్నారు. చంద్రన్న పల్లెబాట, సీసీ రోడ్లు, డ్రైనేజీ, జాతీయ రహదారి ఇలా ఏ కార్యక్రమం చూసినా అద్భుతంగా ఉన్నాయనీ, ఇలాంటి పనులు.. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర విభజన తర్వాత కూడా చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
అపోహలన్నీ పదిరోజుల్లో పటాపంచులవుతాయ్!
” ఏపీ నేతలు ఇంకా రికార్డ్స్ ఏమీ చూడలేదు. ఈ రెండు మూడురోజులు బడ్జెట్పై స్టడీ చేయాల్సిన అవసరముంది. గతంలో పోలవరం విషయంలో ఏపీకి చాలా అపోహలున్నాయి.. ఆ తర్వాత కేంద్ర మంత్రి గడ్కరీ వచ్చి అపోహలు తొలగించడం జరిగింది. ఇప్పుడు పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టును అనుకున్న టైంకు పూర్తి చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. పోలవరం విషయంలో అపోహలు తొలిగే విధంగా ఏవిధమైన చర్యలు తీసుకున్నామో బడ్జెట్ విషయంలో కూడా క్లారిటీ రావాల్సిన అవసరముంది. క్లారిటీ వచ్చాకే అపోహలన్నీ తొలగిపోతాయన్నది నా విశ్వాసం. ఏపీ రాష్ట్రాన్ని బీజేపీ ఎప్పుడూ ప్రత్యేక రాష్ట్రంగానే చూస్తుంది. అపోహలుంటే రాబోయే పదిరోజుల్లో పటాపంచులవుతాయి” అని ఆయన తేల్చిచెప్పారు.
కాగా బడ్జెట్పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే రేపు టీడీపీ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు ఫిబ్రవరి-1న మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.













