ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ … వారందరికీ మరోసారి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఎస్ఐ పరీక్షలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎత్తు విషయంలో తమకు అర్హత ఉన్నప్పటికీ అన్యాయంగా తమను అనర్హతకు గురి చేశారని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. ఎత్తు కొలిచే విషయంలో పరికరాల తప్పిదం వల్ల వేలాది మంది అభ్యర్థులు అర్హత కోల్పోవడంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది.
2019లో అర్హత సాధించిన అభ్యర్థులు 2023 లో ఎలా అనర్హతకు గురవుతారని ధర్మాసనం ప్రశ్నించింది. అనర్హత పొందిన అభ్యర్థులందరికీ మరోసారి దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించి, ఎలక్ట్రానిక్ యంత్రంతో కాకుండా మాన్యువల్గా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థినీ అనుమతించాలని స్పష్టం చేసింది. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థికి సమాచారం ఇచ్చి, ఈ ప్రక్రియ మొత్తం 3 రోజులలోపు పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.













