విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే.. జగన్ చేసిన నష్టమే ఎక్కువ : చంద్రబాబు
పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టమే ఎక్కువన్నారు. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పులకు సంబంధించిన పురోగతిని రాష్ట్ర ప్రజల ముందుంచిన ఆయన, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసి తన కళ్ల వెంట నీళ్లొచ్చాయన్నారు. పోలవరం గురించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలూ తీసుకుంటాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలి. 25 రోజుల్లో బడ్జెట్ ప్రవశపెట్టాల్సిన అవసరం ఉంది. వెబ్సైట్ల ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతాం అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై గత సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ఏటా చేసిన ప్రసంగాలతో పాటు మంత్రిగా అంబటి రాంబాబు చేసిన ప్రకటన వీడియోలను మీడియా సమావేశంలో చంద్రబాబు ప్రదర్శించారు.
పోలవరంపై మొదటి శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులపై రెండో శ్వేతపత్రం ఇస్తాం. రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం. నదుల అనుసంధానికి గుండెలాంటిది. ఇలాంటి పోలవరానికి జగన్ ఒక శాపంలా మారారు. ఈ ప్రాజెక్టు విషయంలో క్షమించారని నేరం చేశారు. రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండూ ప్రధాన ప్రాజెక్టులు. ఈ రెండూ రాష్ట్రానికి రెండు కళ్లులాంటివి. ఈ రెండూ పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని పూడ్చుకొనే అవకాశం ఉంటుంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహం. రాష్ట్ర అభివృద్ధికి జలవిద్యుత్ కీలకం. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వ్యవసాయ రంగానికి ఊతం వస్తుంది. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టమే అధికం. 2014-19 మధ్య పోలవరానికి రూ.11,762 కోట్లు ఖర్చు చేశాం. వైసీపీ ప్రభుత్వం కేవలలం రూ.4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. జగన్ ప్రమాణం చేస్తూనే పోలవరం పనులు ఆపేశారు అన్నారు.













