రాష్ట్రంలో పొత్తులపై అధిష్ఠానమే నిర్ణయం : పురంధేశ్వరి
రాష్ట్రంలో పొత్తులపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. విశాఖలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో పొత్తుపై పవన్ కల్యాణ్ తమ అధిష్ఠానానికి వివరిస్తారని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం తమ అభిప్రాయాలు కూడా తీసుకుంటుందని స్పష్టం చేశారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉంటుందన్నారు. ప్రజావేదిక కూల్చివేత నుంచే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందన్నారు. ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం బాధకరమన్నారు.













